Articles - Enjoy




Name: Admin

Published Date: 06-04-2016


ఎంజాయ్

         (జి.ఎస్.లక్ష్మి) `ఏంటి... నీ కొడుకులివాళ ఫోన్ చేస్తారంటావా...' పొద్దున్నే సుమతి ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అడిగాడు శంకర్రావు. మరే... ఫోన్ చెయ్యనప్పుడు నా కొడుకులూ, చేసినప్పుడు మీ కొడుకులూనూ... అవునూ, కాదూ అని సమాధానం చెప్పకుండా శంకర్రావు మాటని అతనికే తిప్పి కొట్టింది సుమతి మరి లేకపోతే... అక్కడ వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలేంటిట... వారానికి అయిదు రోజులే పని.. రెండు రోజులు శెలవులేనాయే... ఆ రెండు రోజులకూ ఉన్న నలభై ఎనిమిది గంటల్లో కనీసం నాలుగు నిమిషాలు మనకి ఫోన్ చెయ్యడానికి కుదరదూ వాళ్ళకి... మనసుంటే మార్గం ఉంటుంది... నిజంగా ఆలోచిస్తే అంతకన్నా ఎక్కువగానే లెక్కలేస్తోంది సుమతి. కాని కొడుకుల్ని తప్పు పట్టడానికి అమ్మ మనసు అంగీకరించలేదు. వారంలో అయిదు రోజులూ వాళ్ళకి తిండి తినే దృష్టి కూడా ఉండదు. శనాదివారాలే కాస్త వండుకున్నా... ఇల్లు సర్దుకున్నా... బైట నుంచి సామాన్లు తెచ్చుకున్నా... ఎన్నో పన్లు ఆ రెండు రోజులకీ అట్టిపెట్టుకుని ఆఖరికి ఆదివారం రాత్రికి కొన్ని మాత్రమే చేసుకోగలుగుతారు. అక్కడ అన్ని పన్లకీ వాళ్ళే. తుమ్ముకున్నా వాళ్ళే... చిరంజీవి అనుకున్నా వాళ్ళే. మాటసాయం, మనిషి సాయం లేకుండా విపరీతమైన ఒత్తిడులని తట్టుకుంటూ, దేశం కాని దేశంలో పిల్లలు పడుతున్న బాధ ప్రత్యక్షంగా చూసొచ్చిన సుమతికి వాళ్ళని తప్పు పట్టడానికి మనసొప్పలేదు. అదే చెప్పింది శంకర్రావుతో... అన్నీ చూసొచ్చిన వారు, తెలిసున్న వారు. మీకు నేను చెప్పాలా.. పోనీ కోడలికైనా కాస్త గట్టిగా చెప్పొచ్చుకదా నువ్వు... ఊరుకోలేదు శంకర్రావు. కొడుకుతో మాట్లాడి వారం దాటితే చాలు మరింక అతన్ని పట్టుకోలేం. ఒక్కసారి చంటిపిల్లాడి ఏడుపు విన్నా చాలు కదా... అసలు కంటే వడ్డీ ముద్దని స్పష్టం చేశాడు. సర్లెండి... వాడు చేసినప్పుడు చెబుతా అంటూ మాట దాటించేసింది సుమతి. ప్రతి ఆదివారం ప్రొద్దున్నా వాళ్ళింట్లో కార్యక్రమం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అప్పటి తరంలో చాలామంది లాగే శంకర్రావు కూడా ఉద్యోగరీత్యా సొంత ఊరు వదిలి పట్నంలో కాపురం పెట్టి అక్కడే సెటిలయ్యాడు. ఉద్యోగం చేసినన్నాళ్ళూ రోజులో ఇరవై నాలుగు గంటలూ అదే ధ్యాసలో ఉండడం వలన వేరే విషయాలు ఆలోచించడానికి టైముండేది కాదు. ఒక్కొక్క మెట్టూ ఎక్కి కాస్త హోదా పెరిగే సరికి పిల్లలిద్దరూ పెద్దచదువులకొచ్చేరు. మరింక వాళ్ళని ఒకదారిలో పెట్టి, పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసేటప్పటికి పెద్దబ్బాయి కాలిఫోర్నియాలోనూ, చిన్నబ్బాయి షికాగాలోనూ సెటిలయిపోయేరు.

వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళూ చేసి, ఎవరి భార్యలకి వాళ్ళనప్పగించేసరికి శంకర్రావు రిటైరయిపోయాడు. ప్రొద్దున్నేలేచి స్నానం, పూజ, భోజనం అయిపోతే సరి. ఇహ మిగిలిన టైమంతా ఏం చెయ్యాలనే ప్రశ్న భూతంలా ఎదుట నిలబడుతోంది. సుమతీ అంతే. అటూ ఇటూ నలుగురున్న కుటుంబాలవడం వలన పదిమందిలో కలిసిపోయే తత్వం. పదిమందికి వండిపెట్టే చెయ్యి. గుజ్జనగూళ్ళాడినట్టు ఇద్దరికి వంటచేయడం కష్టంగానే ఉంది. ఏదైనా ఆ ఒక్కపూటే. రాత్రికి ఏ ఫలహారమో కానిచ్చేస్తారు. అందుకే సుమతికీ, శంకర్రావుకీ కూడా తెల్లారుతోందంటేనే ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న ఎదురౌతుంది. ఖాళీగా ఉన్న బుర్ర పిల్లల గురించే ఆలోచిస్తుంది. మొన్న చంటిపిల్లాడికి జలుబుగా ఉందన్నాడు, తగ్గిందో లేదో... అనుకుంటూ మొగుడూ పెళ్లాలిద్దరూ చర్చ మొదలుపెడతారు. వాళ్ళకి తెలిసివాళ్ళ చంటిపిల్లలకొచ్చిన జలుబుల గురించి చర్చించి, అది జ్వరానికి దారితీసే దాకా సాగి, ఆఖరికి హాస్పటల్ లో చేర్పించే వరకు వెళ్ళి, అక్కడ స్థిరపడిపోతారు. ఇద్దరూ మనవడిని హాస్పటిల్ చేర్పించేసినట్టు ఊహించేసుకుని, కంగారుపడిపోయి, అమెరికా ఫోన్ చేసేసి... ఆ చంటిపిల్లాడి జలుబు అప్పుడే తగ్గిపోయిందనీ, ప్రస్తుతం వాడు వాళ్ళ అమ్మా, నాన్నల జలుబు వదిలిస్తున్నాడన్న సంగతి వినేవరకూ మనశ్శాంతిగా ఉండలేరు. అందుకే కొడుకులకి ప్రతివారం ఫోన్ చెయ్యమని ఒకటికి పదిసార్లు చెప్తుంటారు. అమెరికాలో వాళ్ళ కొడుకుల పరిస్థితీ అలాగే ఉంది. వాళ్ళకీ తెలుసు... ఆదివారం ప్రొద్దున్న మాట్లాడే ఆ పది మాటల కోసం అమ్మా, నాన్నా ఎదురుచూస్తుంటారని. వాళ్ళు మటుకేం చేస్తారు.... వాళ్ళనక్కడికి రమ్మంటే వచ్చి పదినాళ్ళు కూడా ఉండరు. ఉండలేరు కూడా... అక్కడ వాళ్ళకి తోచదు. మా ఊరు, మా ఇల్లంటూ వచ్చేస్తారు. తీరా వచ్చాక దృష్టంతా పిల్లల మీదే. చేస్తున్న ఉద్యోగాలు వదిలి రాలేరు కదా... అందుకే ప్రతివారం తప్పకుండా ఫోన్ చేస్తారు. కాని ఎప్పుడైనా లైన్ దొరకకపోతే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు..? సుమతి పూజ చేసుకుంటోందన్న మాటే కాని చెవుల్ని మటుకు ఫోన్ శబ్దం వినడానికి వినియోగించేసింది. నిత్యపూజ అయింది. ఆంజనేయస్వామొక్కడే సముద్రందాటి వాయువేగంతో అమెరికా వెళ్లి పిల్లల్ని క్షేమంగా ఉంచగలడని అంత ప్రగాఢ విశ్వాసం. ఇంకా ఫోన్ మోగలేదు. పిల్లలెలా ఉన్నారో... ఆంజనేయస్వామీ... తండ్రీ... సముద్రాన్ని అవలీలగా దాటగలవాడివి నువ్వే... నా బిడ్డల్ని కాయి తండ్రీ... అనుకుని... ఆంజనేయ దండకం మొదలుపెట్టింది. చదువుతున్నకొద్దీ ఆమెకి తెలియకుండానే అమెరికా వెళ్ళిన ఆంజనేయస్వామికి కూడా ఆ దండకం వినపడేలా ఆమె గొంతు హెచ్చింది.

హాల్లో కూర్చున్న శంకర్రావు మరీ అసహనంగా ఉన్నాడు. ఫోన్ సరిగ్గా క్రెడిల్ అయిందో లేదోనని రెండుసార్లు పరీక్ష చేసొచ్చాడు. చేతిలో పేపరు చదవడానికన్నట్లు పట్టుకుని చెవులని ఫోన్ శబ్దానికి అప్పగించేశాడు. శబ్దం చెవులకి వినపడదేమో అన్నట్లు మధ్యలో పేపరు దించి ఫోన్ వంక చూస్తూ కూర్చున్నాడు. ఆఖరికి వారి నిరీక్షణ ఫలిచింది. ఫోన్ మోగింది. పది నిముషాల వ్యవధిలో కొడుకులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. కోడళ్ళు, పిల్లలు అందరి క్షేమ సమాచారాలు అయ్యాయి. అమ్మా, ఏం చేస్తున్నారు మీరు? చిన్న కొడుకు బాబీ కుశల ప్రశ్నలు వేశాడు. ఏముందిరా... పొద్దున్నే పూజయింది. మరింక భోజనాలు చెయ్యాలి. కొడుక్కి అర్థమైంది భోం చేశాక మరింక వాళ్ళకి చేసే పనేం ఉండదు. మళ్ళీ ఆదివారం పొద్దున్న వరకూ ఇవాళ తాము మాట్లాడిన మాటలే మళ్ళీ, మళ్ళీ తల్చుకుని, ఒకటికి రెండర్ధాలు తీసుకుని, బెంగపెట్టుకుని, ఒకరినొకరు ఓదార్చుకుని, లేకపోతే ఒకరిని ఒకరు అరుచుకుని, మనవళ్ళ ముద్దుముచ్చట్లు ఒకటికి పదిసార్లు చెప్పుకుని కాలక్షేపం చేసుకుంటారు. బాబీకి బాధగా అనిపించింది. ఏం చెయ్యగలడు? ఇక్కడి జీవితానికి అలవాటు పడిపోయేడు. నెమ్మదిగా తల్లితో అన్నాడు అమ్మా... నువ్వూ, నాన్నా కూడా ఇన్నాళ్ళూ కాలమంతా మమ్మల్ని ప్రయోజకుల్ని చెయ్యడానికే కష్టపడ్డారు. మీ గురించి మీరు ఆలోచించుకోలేదు. ఇప్పుడు మేం సెటిలయ్యాం కనక ఇప్పుడైనా నువ్వూ, నాన్నా హాయిగా ఎంజాయ్ చెయ్యండి అన్నాడు. ఎంజాయ్ చెయ్యడం అంటే... వెంటనే అడిగింది సుమతి. మేం బాగానే ఉన్నాం... ఉంటాం కూడా. మీకు దగ్గరగా లేమన్న బాధ తప్పితే వేరే సమస్యలేం లేవు. మాకు క్షణం తీరుబడి ఉండదు. మీకు ప్రతిక్షణం మా గురించే ఆలోచన. మీరు మా గురించి ఆలోచించి వర్రీ అయి ఆరోగ్యాలు పాడుచేసుకోవడం తప్పితే దానివల్ల ఎవరికేం లాభం చెప్పండి? మీ చేతిలో ఉన్నంత వరకు మమ్మల్ని బాధ్యతగా పెంచి పెద్దచేశారు. ఇంక నువ్వూ, నాన్నా హాయిగా ఎంజాయ్ చెయ్యండి... ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. కొడుకుతో మాట్లాడేక సుమతికీ, శంకర్రావుకీ కూడా కొడుకు మాటల్లో సత్యం ఉందనిపించింది. నిజమే... రెక్కలొచ్చిన పక్షులు. వాటి గూడు అవి కట్టుకుంటాయి. లోకధర్మం... తమకి కాళ్ళూ, చేతులూ బాగానే ఉన్నాయి. డబ్బుకి లోటు లేదు. దుర్వ్యసనాలు లేవు. బి.పి, షుగర్ లాంటి జబ్బులు లేవు. మరింక కొడుకన్నట్టుగా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు కదా... కాని ఎంజాయ్ చెయ్యడమంటే ఏంటి? ఎలా? ఇన్నాళ్ళూ పిల్లల్ని పరీక్షలకు చదివించడాలూ, మంచి ట్యూషన్లు వాకబుచేసి కుదర్చడాలూ, పరీక్షల్లో వాళ్ళతో పాటు మేలుకోవడాలూ, రిజల్ట్సు వచ్చే టైముకి పిల్లలకన్నా ఎక్కువగా టెన్షన్లు పెట్టుకోవడాలూ, పై చదువులకి పంపించడాలూ, వాళ్ళ ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ వాటన్నింటితో ఒకదాని తర్వాత ఒకటి బిజీగా ఉండేవారు.

అసలు రిలాక్స్ అవడం అంటే ఏమిటో ఇద్దరికీ తెలియదు. ఇప్పుడొక్కసారిగా అంతా ఖాళీ. ఏ పనీలేని పరిస్థితి. ఇప్పుడు ఎంజాయ్ చెయ్యాలంటే ఎలాగో వాళ్ళిద్దరికీ తెలియటం లేదు. ఎలా అన్నప్రశ్న ఒక భూతంలా వాళ్ళముందు నిలబడింది. మొన్న చలపతి అన్నాడు సుమతీ, టైము గడవాలంటే హాయిగా ఏసి థియేటర్ లోకి వెళ్ళి కూర్చోవాలని. ఒక పూటంతా గడిచిపోతుంది. నిజమే సినిమా రెండు మూడు గంటలు... రానూ పోనూ ప్రయత్నం మరో గంటతో సగం రోజు ఇట్టే గడిచిపోతుంది. అసలు వాళ్ళీ మధ్య పదేళ్ళ నుంచి సినిమాలు చూడడం మానేశారు. మరిప్పుడు కాలం గడవడానికి సుమతి, శంకర్రావు ఇద్దరూ సినిమాకి బయల్దేరారు. థియేటరు దగ్గరున్న జనాన్ని చూసి హడలిపోయారు. సినిమా పేరు `ధర్మరాజ్యం' రామరాజ్యం గురించి విన్నారు కాని, ఈ ధర్మరాజ్యమంటే ఏమిటో, రామరాజ్యంలో ధర్మాలకీ, ధర్మరాజ్యంలో ధర్మాలకీ పోలికేమిటో, తేడాలేమిటో తెలుసుకోవాలని ఇద్దరూ స్థిరనిశ్చయంతో కూర్చున్నారు. సినిమా మొదలయి హీరో తెర మీద కనిపించగానే చెవులు చిల్లుపడేట్లు శబ్దాలు. హడలిపోయారిద్దరూ. ఏమిటా అని చూస్తే ఆ సినిమాలో హీరో అభిమానులట. వాళ్ళ అభిమాన నాయకుడు తెరమీద కనిపించగానే గంగవెర్రులెత్తినట్లు కేకలు, గెంతులు, చేతిలో ఉన్న దండలు తెరపైకి విసరడాలూ, ఈలలూ ఇవన్నీ సద్దుమణిగే సరికి సినిమా పావుగంటయిపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని సినిమా మీద దృష్టి సారించారు శంకర్రావు, సుమతి. తీరా చూస్తే ధర్మరాజ్యమంటే ధర్మారావు అనే పేరుగల వ్యక్తి ఈ ప్రజాప్రభుత్వంలో తనకి తానుగా సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుని, తనకి తోచినది న్యాయంగా చేసినది ధర్మంగా పరిపాలించడమే ధర్మరాజ్యమని వాళ్ళకి అర్థమయ్యేసరికి సినిమా ఇంటర్వెల్ కి వచ్చేసింది. అప్పటికే హీరో నలుగురు హిరోయిన్లతో విదేశాల లొకేషన్లలో డాన్సులు చేసేశాడు. సినిమాల్లో ఫైట్లు ఎలాగో కష్టపడి చూశారు కానీ, హీరో హీరోయిన్ల డాన్సులు మటుకు చూడలేకపోయారు శంకర్రావు, సుమతీను. ఆ పాటేంటో అర్థం కాలేదు సరే... అదలా ఉంచి మిలటరీ కవాతుల్లా వాళ్ళిద్దరి వెనకాల ఇటో అరవై మంది, అటో ఇరవై మంది ఎగస్ట్రాలు. వాళ్ళెవరో అక్కడికెందుకొచ్చారో అర్థం అవడం మాట అటుంచి పాట మధ్యలో ఆర్కెస్ట్రా వచ్చే టైముకి థియేటర్లో స్టీరియో సౌండు. మరింక తట్టుకోలేకపోయారిద్దరూ. నెమ్మదిగా లేచి ఇంటికొచ్చేశారు. ఆ సౌండ్ కి వాళ్ళ మెదళ్ళు ఎంత జామ్ అయిపోయాయంటే వచ్చేటప్పుడు రెండుచోట్ల ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నట్టుగాని, ఆ రోడ్ల మీద పోయే వాహనాల పోరు కానీ ఏదీ వాళ్ళ బుర్రల్లోకి వెళ్ళలేదు. ఇంటికొచ్చి తలుపులన్నీ వేసుకుని అరగంట సేపు కళ్ళు మూసుకుని పడుకుంటే కాని ఇద్దరూ మామూలు స్థితిలోకి రాలేకపోయారు. వచ్చాక మళ్ళీ జన్మలో థియేటర్ కు వెళ్ళి సినిమా చూడకూడదని ఒట్టు పెట్టేసుకున్నారు.

మరింక ఎంజాయ్ చెయ్యడం ఎలాగ? సుమతి తన అక్క కూతురు వసంతకి ఫోన్ చేసింది. అసలే ఉద్యోగస్తురాలు. క్షణం తీరని మనిషి. ఆమె ఫోన్ లో దొరకడమే అపురూపం. మరింక వసంతని వదల్లేదు సుమతి. `ఏంటే బొత్తిగా నల్లపూసవయిపోయావు? ఈ పిన్నొకత్తుందని మర్చిపోయావేంటి? ఎప్పుడైనా రావచ్చుకదా...' ఫోన్ లోనే నిష్ఠూరమాడింది. `లేదు పిన్నీ, ఎప్పటికప్పుడు రావాలనే ప్రయత్నం. కాని కుదరటంలేదు. బిజీ పిన్నీ, ఆదివారమొస్తే చాలు... పిల్లలేదో ప్రోగ్రామ్ పెట్టేస్తారు. వారమంతా కష్టపడతాం కదా... వీకెండయినా ఎంజాయ్ చెయ్యకపోతే ఎలాగంటారు'. ఎంజాయ్ అన్నమాట టక్కున పట్టుకుంది సుమతి. ఎంజాయ చెయ్యడమంటే ఏం చేస్తారే..? ఇదివరకైతే ఎంజాయ్ మెంటంటే సినిమా ఒకటే ఉండేది. ఈ రోజుల్లో ఎంజాయ్ మెంటుకి బోల్డు మార్గాలు. ఔటింగ్స్, రిస్టార్ట్స్, టూరిస్ట్ స్పాట్స్... ఇప్పుడన్నీ బాగా డెవెలప్ చేశారు కదా... సరిగా అర్ధం కాలేదు సుమతికి. ఇంతకీ మొన్న సండే ఎక్కడికెళ్ళారు మీరు? సిటీ బైట గుజరాతీ, రాజస్థానీ ప్రదర్శనలు ఆ ట్రెడిషన్ తెలిపేలా ఉంటాయి పండగ రోజుల్లో. ఆ పండక్కి సంబంధించిన అలంకారాలు, దానికి సంబంధించిన డాన్సులూ, మ్యూజిక్కూ, గేమ్సూ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీకి ఇంతని తీసుకుంటారు. ఈ సిటీ పొల్యూషన్ కి దూరంగా, హాయిగా గడిపెయ్యొచ్చు. మంచి ఫుడ్ ఉంటుంది. బోల్డు మంది జనాలొస్తారు. మొన్న వీకెండ్ మేమెంత బాగా ఎంజాయ్ చేశామో తెలుసా... అవును పిన్నీ, తోచట్లేదు....మీరు రండి అని మమ్మలందర్నీ పిలిచే బదులు నువ్వూ, బాబాయ్ గారూ హాయిగా అలా వెళ్ళి ఎంజాయ్ చెయ్యొచ్చుకదా... ఉచితసలహా పడేసింది. సుమతి సంసార అనుభవం వెంటనే ఒక ప్రశ్న అడిగింది. అంటే అక్కడ మెంబరవ్వాలా... ఎంత కట్టాలి... అంటూ మెంబరవ్వాలని రూలేం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజర్వ్ చేసుకోవచ్చు. మొన్న వీకెండ్ కి మా ఫ్యామిలీకి ఐదు వేలయింది. అయినా మీకేం లోటని? హాయిగా ఎంజాయ్ చెయ్యండి.... ఫోన్ పెట్టేసింది వసంత. ఒక్క వీకెండ్ కి అయిదువేలా... ఆలోచించింది సుమతి. నలుగురున్న ఫ్యామిలీ కనుక వాళ్ళకి అయిదు వేలైంది. తమిద్దరికీ కనీసం రెండువేలవ్వచ్చు. ఒక్క వీకెండ్ ఎంజాయ్ మెంటుకి రెండువేలు ఖర్చా... మింగుడుపడలేదు సుమతికి. అదేమాట శంకర్రావుతో చెప్పింది. వసంత, మొగుడూ ఐటి ఉద్యోగస్తులోయ్. ఆ మాట మర్చిపోకు. వాళ్ళ జీతాలూ అలాగే ఉంటాయి... ఖర్చులూ అలాగే ఉంటాయి... మన ఆలోచనలకది సరిపడదు. అంటే అంత డబ్బు మనం ఖర్చుపెట్టలేమా?

ఇక్కడ డబ్బుందా లేదా అన్నది ప్రశ్న కాదు... ఇదే కనుక ఏ చదువుకునే కుర్రాడో ఫీజుకి డబ్బుల్లేవంటే మారు ప్రశ్న వెయ్యకుండా వేలిచ్చేస్తాం... కాని మనకి కాలక్షేపం కోసమంటూ అన్ని వేలు ఖర్చంటే... నసిగాడు శంకర్రావు. నిజమే... ఒక్కొక్క రూపాయి సంపాదించడా

Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.