Articles - Agni Pariksha




Name: Admin

Published Date: 05-04-2016


అగ్ని పరీక్ష

           పూర్వం మగధ రాజ్యం లో వేద ధర్ముడనే సాధు పుంగవుడు వుండే వాడు. అతడు సకల వేద, శాస్త్ర పారంగతుడు. పురాణేతి ఇతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. ఊరికి నాలుగు క్రోసుల దూరం లో ఒక నది ఒడ్డున చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తుండే వాడు. వేద ధర్ముడు మహా శివ భక్తుడు. వేకువ జామునే లేచి కాల కృత్యాలు తీర్చుకొని, స్వయంగా గోవు పాలు పితికి శివునికి అభిషాకం చేస్తేనే గాని పచ్చి గంగయినా ముట్టేవాడు కాదు. శివ భక్తియే కాక వేద ధర్ముడు గొప్ప మానవతా విలువలు మూర్తీభవించిన నిర్మల హృదయుడు. తన గుమ్మం లోనికి ఎవరొచ్చినా సరే, తనకు మిగిలిందా లేదా అని కూడా చూసుకోకుండా దాన ధర్మలు చేస్తుండే వాడు. ఒకసారి మహాశివుడు వేద ధర్ముని భక్తి, విశ్వాసాలను పరీక్షించ దలిచాడు. వేద ధర్ముని ఆశ్రమ ప్రాంతం లో తీవ్రమైన కరువు కాటకాదులను సృష్టించాడు. ఆ ప్రాంతం లోని ప్రజలు దేశం లోని ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళిపోసాగారు. ఆశ్రమానికి వచ్చి కానుకలను సమర్పించే వారి సంఖ్య గణనీయం గా తగ్గిపోయింది. సరైన పోషన లేక ఆవు కూడా కొద్ది రోజులకే మరణించింది. ఇన్ని ఇబ్బందులు ఏకకాలం లో ఎదురైనా సరే వేద ధర్ముడు తన శివారాధనను మానలేదు. పాలు లేకపోయినా, స్వచ్చమైన నదీ జలంతో నిత్యం మహాశివునికి అభిషేకం జరుపుతుండే వాడు. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అనే చందాన తనను సృష్టించిన ఆ మహా శివుడే తన పోషణ భారం కూడా చూసుకుంటాడన్న ధృఢమైన విశ్వాసంతో వున్నాడు వేద ధర్ముడు. ఇదిలా వుండగా ఒకసారి ఆశ్రమం లో బియ్యపు గింజలు పూర్తిగా నిండుకున్నాయి. తోటలో ఫలాల చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయాయి. కటిక ఉపవాసం చేయవలిసి వచ్చింది. అయినా కేవలం మంచి నీరు త్రాగుతూ, శివ పంచాక్షరీ మంత్రం జపిస్తూ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు వేద ధర్ముడు. నాలుగు రోజులు అలాగే గడిచాయి.తీవ్రమైన నీరసం ఆవహించినా శివ నామ జపం ఆపలేదు వేద ధర్ముడు.ఇంతలో ఒక భక్తుడు వచ్చి కొంచెం బియ్యం సమర్పించి వెళ్ళాడు. 'శివార్పణ మస్తు' అని ఆ బియ్యాన్ని పులగంగా వండి శివునికి నైవేద్యం అర్పించాడు వేద ధర్ముడు. అతి పవిత్రమైన ఆ భుక్తాహారామ్మి స్వీకరించే తరుణం లో 'తండ్రీ ధర్మం చెయ్యండి' అనే అతి దీనమైన పిలుపు ఆశ్రమ ప్రాంగణంలో వినిపించింది. వెంటనే బయటకు వెళ్ళీ చూస్తే ఒక ముదుసలి చేతిలో కర్రతో వణుకుతూ నిలబడి వున్నాడు. ముఖమంతా మడతలు పడి వుంది. శరీరం వ్యార్ధకంతో నిండి వుంది.'స్వామీ! వారం రోజుల నుండి తిండి లేదు.ఆకలితో చచ్చిపోతున్నాను. తినడానికేమైనా ఇచ్చి కాస్త పుణ్యం కట్టుకో.ఏ క్షణాన్నైన్నా నా ప్రాణం పోయేట్టు వుంది' అని అతి దీనంగా విలపించాడు ఆ ముసలి వ్యక్తి. వేద ధర్ముని హృదయం ఆ మాటలకు పూర్తిగా ద్రవించింది. తన ఆకలి కంటే ఆ ముసలివాని ఆకలి మరింత తీవ్రమైనది. తాను అదృష్టం చేసుకోబట్టే ఆ ముసలి వాని ఆకలి తీర్చే భాగ్యం తనకు కలిగింది అనుకుంటూ ఆ ముసలిని 'అతిధిదేవో భవ' అంటూ సాదరంగా ఆహ్వానించి, కాళ్ళు చేతులు కడిగి ఒక ఆసనంపై కూర్చోబెట్టి తాను వండిన అన్నం మొత్తమును ఆ ముసలి వానికి వడ్డించేసాడు. భోజనానంతరం త్రాగడానికి స్వచ్చమైన నీరు ఇచ్చి 'మీరు అలసట తీరే వరకు ఇక్కడే విశ్రమించండి' అని అతనిని తన ఆశ్రమం లోపల పరుండబెట్టాడు. అంతే కాక తానే స్వయంగా అతనికి సపర్యలు చేసాడు. సాయంత్రానికి సేద తీరి తిరిగి శక్తి సంపాదించుకున్న ఆ ముదుసలి తనకు జరిగిన అథిధి సత్కారానికి ఎంతో ఆనందించి వేద ధర్ముని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తినడానికి ఏ మాత్రం భోజనం మిగలనందుకు వేద ధర్ముడు కించిత్ కూడా బాధ పడలేదు. పైగా వాకిట్లో నిలచిన అతిధికి తాను చేతనైనంతగా సత్కారం చేయగలిగినందుకు ఎంతో సంతోషించాడు. ప్రాణాలను నిలుపుకునేందుకు శివ పంచాక్షరీ మంత్ర జపమునే సాధనంగా ఎంచుకున్నాడు. ఆ ముదుసలి రూపం లో వచ్చి తన భక్తుడిని పరీక్షించిన మహా శివుడు తన అగ్ని పరీక్షలో నెగ్గినందుకు వేద ధర్ముడిని ఆశీర్వదించాడు. జీవితపు అంతిమ ఘడియలలో అతనికి శాశ్వత శివ సాయుజ్యం ప్రసాదించాడు. భగవంతుడు పెట్టే వివిధ రకములైన పరీక్షలకు తట్టుకొని , ఆత్మ విశ్వాసం తో, సహనం, పట్టుదలలతో ఆ భగవంతుని పాదాలను చివరి వరకు విడువని వారే అధ్యాత్మిక జీవితాలలో విజయం సాధిస్తారు అనడానికి వేద ధర్ముని జీవితమే ఒక నిదర్శనం.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.